ప్రస్తుతం కరోనాతో మన దేశం అతలాకుతలం అవుతోంది. రోజురోజుకూ కరోనా తీవ్రతరంగా మారుతోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో కరోనా ఎంతో మంది జీవితాల్లో చీకటిని నింపుతోంది. టాలీవుడ్లో ఇప్పుడు కరోనా వల్ల ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయారు. చిన్న ఆర్టిస్ట్లు ప్రాణాలు కోల్పోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.స్టార్ హీరోలకు ప్రత్యేకంగా కేరవ్యాన్స్, ప్రత్యేక సిబ్బంధి అంటూ ఉంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువగా అలాంటి వారే కరోనాకు బలి అవుతున్నారు. అయితే కొంత మంది హీరోలు మాత్రం వారి స్టాఫ్ కోసం ముందుకు వస్తున్నారు. అందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కష్టకాలంలో వారికి తోడుగా నిలుస్తున్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి తన కేరవ్యాన్ డ్రైవర్ మరణం పట్ల తీవ్ర విషాదానికి లోనయ్యారు.
కేరవ్యాన్ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి చెందారు. ఈయనకు కరోనా సోకడంతోనే ఆచార్య షూటింగ్ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. గత నెలలోనే జయరాం కరోనా బారినపడ్డారు. అయితే కరోనాతో పరిస్థితి విషమించడంతో జయరాం ఈ మధ్యే మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి చిరంజీవి గొప్ప మనసును చాటుకున్నారు.