మంద కృష్ణ మాదిగ విన్నపం పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు విచారణను ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ చేసిన సురేశ్ ని పిలిచి విచారించారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలను తీసుకున్నారు. కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడితే, సురేశ్ కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అంతేకాదు, ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగిందనే విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
మరోవైపు కత్తి మహేశ్ తండ్రి ఓబులేసు మాట్లాడుతూ, తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని చెప్పారు. మహేశ్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పలేదని… నేరుగా బయటకు వెల్లడించారని అన్నారు. తన కుమారుడి మృతిపై న్యాయ విచారణ జరగాలని కోరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం సహకరించడం లేదని… న్యాయం కోసం తాను పోరాడే స్థితిలో లేనని చెప్పారు.