బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసులో స్కానర్ లో ఉందని ఎన్సిబి వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఆర్యన్ ఖాన్, అనన్య మధ్య జరిగిన వాట్సప్ చాట్ లో ఫుట్ బాల్ పేరుతో చాటింగ్ జరిగిందని, కానీ అది కోడ్ లాంగ్వేజ్ లో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులతో పాటు ఆర్యన్, అర్బాజ్ల జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 30 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది.
ఇంతకుముందు ఆర్యన్ వాట్సాప్ చాట్లలో నటితో డ్రగ్స్పై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఎన్సిబి మాదకద్రవ్యాల వ్యాపారులతో ఆర్యన్ వాట్సాప్ చాట్ను బుధవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. అనన్య కేసు ఆర్యన్ ఖాన్ విషయంతో ముడిపడి ఉందో లేదో ఎన్సిబి ఇంకా నిర్ధారించలేదు. కాగా అక్టోబర్ 26 న ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ జరుపుతుంది. షారుఖ్ ఈరోజు ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్ను కలిశారు. ఇప్పటికి ఆర్యన్ ఖాన్ కు జైలులో ఇది 18 వ రోజు.