అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. ప్రస్తుతం సికింద్రాబాద్లో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి సంబంధించిన చిత్రీకరణ మరో 45 రోజుల్లో పూర్తికానున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్గా కనిపించనున్నారు. రష్మిక నాయిక. మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. ‘ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్’ పేరుతో ఇప్పటికే విడుదలైన వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్- అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది.