గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల అవస్థలు చూసి చలించిపోయి.. సహయానికి ముందుకు వచ్చాడు సోనూసూద్. ఎంతోమందిని సోంతుళ్లకు చేర్చడమే కాకుండా.. జీవనానికి కావాల్సిన డబ్బులను సైతం అందచేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికీ అడిగిన వారికి లేదనకుండా తనవంతు సాయాన్ని అందిస్తున్నాడు. తాజాగా మరో నటుడు కరోనా రోగులను చూసి చలించిపోయాడు. వారికి చికిత్స చేసే ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయని భావించాడు. బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న కరోనా రోగుల కోసం హాస్పిటల్ నిర్మిస్తానని ప్రకటించాడు నటుడు గుర్మీత్ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్ళను త్వరలోనే ప్రారంభిస్తాతని ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
సామాన్య ప్రజలకు వైద్య సాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని వెల్లడించాడు. అతను సంకల్పించిన ఈ ఆశయం నెరవేరేందుకు తనకు అండగా ఉంటారని ఆశిస్తున్నానంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. కాగా ఈ నటుడు కోవిడ్ పేషెంట్లకు సాయం అందించడంలో ముందు వరుసలో ఉన్నాడు. అవసరమైనవారికి ప్లాస్మాదానం అందేలా, ఆక్సిజన్ చేరేలా, పేషెంట్లకు బెడ్లు దొరికేలా చర్యలు తీసుకుంటున్నాడు. అయితే గతేడాది గుర్మీత్ చౌదరి, అతడి భార్య దెబీనా బెనర్జీ కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. అదే సమయంలో తన అభిమానులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు.