ఓ బేబీ సినిమా తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన బాలనటుడు తేజ, జాంబి రెడ్డి అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న తేజ.. తన మొదటి చిత్రం షూటింగ్ లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలతోపాటు, తన చిన్ననాటి సినిమా జ్ఞాపకాలను పంచుకున్నాడు.
చిరంజీవి సర్ జ్వరంతో ఉన్నారు.. మా ఇద్దరి మధ్య నీళ్లలో ఓ షాట్ తీయాలి. కానీ నేను నీళ్లలోకి వెళ్లనంటూ మారాం చేశాను. ఆ షాట్ కంప్లీట్ అయ్యేసరికి రెండు గంటలు పట్టింది. అప్పటి వరకూ చిరంజీవిగారు నీళ్లలోనే ఉన్నారు నాకోసం’ అని చెప్పాడు బాలనటుడు కమ్ హీరో తేజ.”నేను చిరంజీవిగారితో పాటు వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు సినిమాల్లో బాలనటుడిగా నటించాను. మహేష్ గారితో యువరాజు, రాజకుమారుడు చిత్రాల్లో నటించాను. వాళ్లందరితో నాకు మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారు హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ ‘ఇంద్ర’ ‘ఠాగూర్’ ‘అందరి వాడు’ సినిమాల్లో నేను బాలనటుడిగా మంచి పాత్రలు పోషించాను. ‘చూడాలని వుంది’ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’ అంటూ చిరుకు తనకు మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని వివరించాడు తేజ.
చూడాలని ఉంది సినిమా తెరకెక్కించే టప్పుడు ఒక షూట్ షెడ్యూల్ లో భాగంగా తలకోన అడవుల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో చిరు సర్ జ్వరంతో ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకొని మరీ షూటింగ్ లో పాల్గొన్నారు. అప్పుడు నా వయసు మూడేళ్లు. అయితే.. చిరు సర్ కు నాకూ మధ్య ఓ సన్నివేశం షూట్ చేయాల్సి ఉంది. ఈ సీన్ లో నన్ను చిరంజీవిగారు కొలనులోనుంచి పైకి లేపాలి. షాట్ రెడీ కాగానే ఆయన కొలనులోకి దిగి నిలబడ్డారు. నేను మాత్రం దిగనంటూ మారాం చేశాను.
దీంతో.. ఆ ఒక్క షాట్ కోసం ఆయన దాదాపు రెండు గంటలపాటు నీటిలో నిలబడి ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు జ్వరం మరింత ఎక్కువైంది. ఈ ఘటన వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సినిమా పట్ల చిరు చూపించే మక్కువ సహనటులకు ఆయన ఇచ్చే గౌరవం. ఇలా ఎన్నో గొప్ప విషయాలను ఆయన నుంచి నేర్చుకున్నాను’ అని నాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు తేజ.