దర్శకుడి ఊహను అర్థం చేసుకుని… అంతే అందంగా ప్రేక్షకులకు తన కెమెరా కంటితో చేరవేసేది ఛాయాగ్రాహకులే. సినిమా మేకింగ్లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఊహ, కెమెరా కన్ను ఒకరిదే అయితే? స్టోరీ టెల్లింగ్, సినిమా లుక్ హై స్టాండర్డ్స్లో ఉంటాయి. గతంలో మెగాఫోన్ పట్టిన సినిమాటోగ్రాఫర్స్ మంచి సినిమాలు అందించారు. దర్శకులుగా మారిన ఛాయాగ్రాహకుల జాబితాలో ఇప్పుడు ‘గరుడవేగ’ అంజి కూడా చేరనున్నారు. ‘ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు’ సినిమాటోగ్రాఫర్గా పరిచయమైన ఆయన… తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు పని చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితర దర్శకుల ఊహలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు ఓ సినిమాకు దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించారు.
‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. కెమరామెన్ గా ఆయన 50వ చిత్రమిది. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీరాజా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఫస్ట్లుక్ను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి ఈ రోజు విడుదల చేశారు. ముఖ్య తారాగణం అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలో టీజర్, డిసెంబర్లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.