గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఐలయ్యగౌడ్ను అభినందిస్తూ సోమవారం మంత్రి కేటీఆర్ సన్మానించారు. అక్టోబర్ 2న లంగర్హౌస్ బాపూఘాట్లో గాంధీ జయంతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన తిరిగి వెళ్లే క్రమంలో మంత్రి కారును డ్రైవర్ రాంగ్రూట్లో నడిపాడు. దీనిని గమనించిన ఎస్ఐ ఐలయ్య గౌడ్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆ కారుకు చలాన వేశారు. విధుల్లో పూర్తి బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేసినందుకు ఐలయ్యను ,కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులను మంత్రి ప్రశంసించారు. ట్రాఫిక్ నియమనిబంధనలు ఎవ్వరికైనా ఒకటే అని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.