వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. వైఎస్సార్టీపీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కీలక ప్రకటన చేశారు. అలాగే తన రాజీనామా లేఖను వైఎస్ షర్మిలకు పంపించారు. ‘షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను. నాకు మద్దతుగా నిలిచిన, ప్రోత్సహించిన వైఎస్ షర్మిలక్కకు ధన్యవాదాలు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను’అని తెలిపారు.
వైఎస్సార్సీపీలో కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమె రాజీనామాకు గల కారణాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఎందుకంటే వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి.. ఇందిరా శోభన్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి కార్యక్రమంలో షర్మిలతో పాటు ఆమె కనిపిస్తూనే ఉన్నారు. అలాగే వైఎస్సార్టీపీ తరఫున టీవీ చర్చ కార్యక్రమాల్లో బలంగా వాయిస్ వినిపిస్తూ వచ్చారు.
ఇక, ఇప్పటికే జులై 8న వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల.. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రతి మంగళవారం ఒక్కో జిల్లాలో నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. అయితే ఆమె పార్టీ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకముందే.. ఒకరిద్దరు నేతలు రాజీనామా చేయడం ఊహించని షాక్ అనే చెప్పాలి. గత నెలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైఎస్ఆర్టీపీ ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్న ప్రతాప్ రెడ్డి.. వైఎస్ఆర్టీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు.