సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్ స్పందించారు. గత సాయంత్రం ఆయన అకస్మాత్తుగా చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరినట్టు తెలిసి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్ బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు.కాగా, రజనీకాంత్ ఆసుపత్రిలో చేరిన విషయమై స్పందించిన లత మాట్లాడుతూ.. సాధారణ హెల్త్ చెకప్లో భాగంగానే ఆసుపత్రిలో చేరారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒకసారి ఇలాంటి పరీక్షలు సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. రజనీకాంత్ తీవ్రమైన తలనొప్పి, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తొలుత వార్తలు వచ్చాయి. నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కొన్ని గంటల్లోనే ఇంటికి చేరుకుంటారని తొలుత అనుకున్నప్పటికీ, నేడు కూడా పూర్తిగా ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గతరాత్రి ఆసుపత్రికి వెళ్లిన రజనీ తనయ ఐశ్వర్య తండ్రిని పరామర్శించారు.