టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ కు క్యారెక్టర్ లేదని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏది చెపితే… రేవంత్ రెడ్డి అదే చెపుతారని ఎద్దేవా చేశారు. రేవంతర్ రెడ్డికి ఒక పార్టీ అంటూ లేదని విమర్శించారు. రేవంత్ ది కాంగ్రెస్ పార్టీ కాదని… తెలుగు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
అమరావతి గురించి రేవంత్ రెడ్డికి ఎందుకని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ… మరో పార్టీ అధినేత (చంద్రబాబు) అంటే ఇష్టమని చెపుతారని దుయ్యబట్టారు. రేవంత్ క్యారెక్టర్ ఇదని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు.