కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పదం తప్ప మరోటి వినిపించడం లేదు. ఈ మహమ్మారి అంతులేని విషాదాన్ని నింపుతుంది. ఇప్పటికే ఈ మాయదారి రోగంతో చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూసారు. అందులో ఎస్పీ బాలు లాంటి దిగ్గజం కూడా ఉన్నారు. నిన్నటికి నిన్న కరోనాతోనే దర్శకుడు కేవీ ఆనంద్ కూడా కన్నుమూసారు. తెలుగులోనూ చాలా మంది ఈ వైరస్ బారిన పడి బలైపోతున్నారు. తాజాగా మరో టాలెంటెడ్ నటుడిని కరోనా బలి తీసుకుంది. కేవలం 52 ఏళ్ళ వయసులోనే బాలీవుడ్ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్పాల్ కన్నుమూసారు. తెలుగులో ఘాజీ అటాక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. బిక్రమ్ జీత్ మరణించిన విషయాన్ని దర్శకుడు అశోక్ పండిత్ ట్విటర్లో పోస్ట్ చేసారు. చాలా చిన్న వయసులోనే ఈయన మనందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకారమని ఆయన సంతాపం తెలియచేసారు. రిటైర్డ్ ఆర్మీ మేజర్ అయిన బిక్రమ్జీత్ 2003లో నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు.
ఎన్నో సినిమాలు, సీరియళ్లు, వెబ్సిరీస్లలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బిక్రమ్జీత్. ప్రభాస్ సాహో, ఘాజీ అటాక్, రామ్ చరణ్ జంజీర్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కు కూడా పరిచయం అయ్యారు బిక్రమ్జీత్.
అతని మృతికి నటుడు నీల్ నితిన్ ముకేష్ నివాళులర్పించారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు కూడా బిక్రమ్జీత్ మరణంపై సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన స్పెషల్ యాప్స్, ఇల్లీగల్-జస్టిస్, ఔట్ ఆఫ్ ఆర్డర్, ఆప్కే కమ్రే మే కోయి రెహతా హైలాంటి వెబ్ సిరీస్లలో బిక్రమ్ నటించారు. చిన్న వయసులోనే ఈయన కరోనాతో కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.