ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు గత సంవత్సరం కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 3.7 కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పుల వివరాలను మోడీ వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను వెల్లడించారు. 2020లో రూ. 2.85 కోట్లు ఉండగా, ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. కాగా, ప్రభుత్వం నుంచి పొందే రూ. 2 లక్షల జీతమే ప్రధాని మోడీకి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడమే ఆయన ఆదాయంలో వృద్ధికి కారణం కావడం గమనార్హం.
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచీలో మోడీ ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ గత సంవత్సరం రూ. 1.60 కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 1.86 కోట్లకు పెరిగింది. నరేంద్ర మోడీ వద్ద 4 బంగారపు ఉంగరాలు ఉండగా, వాటి విలువ రూ. 1.48 లక్షలుగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1.5 లక్షలు, నగదు రూపంలో రూ. 36వేలు ఉన్నాయి. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ఎలాంటి ఆస్తులు కొనుకోలు చేయలేదు. సొంత వాహనం కూడా లేదు. 2002లో మోడీ సహా మరో ముగ్గురు వాటాదారులు కొనుగోలు చేసిన నివాస భవనం విలువ రూ. 1.10 కోట్లుగా ఉంది. పబ్లిక్ డొమెయిన్, ప్రధానమంత్రి వెబ్ సైట్లలో మోడీ ఆస్తుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. కాగా, ప్రజా జీవితంలో పారదర్శకత కోసం 2004లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఆస్తుల వెల్లడి ప్రక్రియను ప్రారంభించగా.. అప్పట్నుంచి పలువురు రాజకీయ నేతలు ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తున్నారు.
ఇది ఇలావుండగా, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తోపాటు పలువురు దేశాధి నేతలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికా భారత్ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటాయని దేశాధినేతలు ప్రకటించారు. తాజాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ ఊహించినట్టే- ఉగ్రవాదం అంశాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నితంగా హెచ్చరిక సందేశాలను కూడా పంపించారు. ఈ హెచ్చరిక సందేశాలు పరోక్షంగా పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించినవే. తమ స్వార్థం కోసం ఏ దేశం కూడా ఆప్ఘనిస్తాన్ను వినియోగించుకోకూడదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఆప్ఘనిస్తాన్ సమస్య అత్యంత సున్నితమైనదని అభివర్ణించారు. దాన్ని అంతే సున్నితంగా చూడాల్సిన, పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆప్ఘనిస్తాన్లో నెలకొన్న ఈ సున్నిత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, తమ స్వార్థం కోసం వినియోగించుకోవడానికి ఏ దేశం కూడా ప్రయత్నించకూడదని అన్నారు. ఈ దిశగా ప్రపంచ దేశాలకు ఒక భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.