మా ఎన్నికలు ఇంకా మొదలుకాకముందే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రతిపక్షాలు, విపక్షాలు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలపై వాడీ వేడీ చర్చలు కూడా జరుగుతున్నాయి. పైగా ఈసారి ఐదుగురు నటులు మా ఎన్నికల్లో పోటీకి ఉండటంతో ఈ సారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికలేమీ ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని చెప్పి బాంబు పేల్చారు.
గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండేవాళ్లని.. అప్పట్లో అంతా పద్ధతిగా ఉండేదని చెప్పాడు మురళీ మోహన్. కానీ ఇప్పుడలా లేదంటూ విమర్శించాడు. ప్రస్తుతం ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దక్కుతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎవరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరో.. ఎవరు కాదో అర్థం కావడం లేదని విమర్శించాడు. గాడి తప్పిన ‘మా’ను మళ్లీ పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నామని.. అందులో భాగంగానే ఈ సారి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేసి మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని మురళీ మోహన్ తెలిపాడు.