జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవని అభిప్రాయపడ్డారు. బెడ్ రూమ్స్లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త ఘాటు పదజాలాన్నే ఉపయోగించారు. బెడ్ రూమ్ చాలా చిన్నదిగా ఉందని.. లబ్ధిదారులు రాత్రివేళల్లో బెడ్ రూమ్ లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త ‘ఏ’ గ్రేడ్ కామెంట్స్ పేల్చారు. బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. బాత్ రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్లో పడుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే డైలాగులు పేల్చారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్పై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాగా ఎప్పుడూ కాస్త అగ్రెసీవ్గా ఉంటారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇటీవల ఆ జిల్లా ఎస్పీగా రిలీవ్ అయిన భాస్కర్ భూషణ్ను ఈ ఏడాది జనవరిలో బాహాటంగానే విమర్శించారు. భాస్కర్ భూషణ్ జిల్లా ఎస్పీలా కాకుండా టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్తగా ఉండు’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.