చిత్రం: వరుడు కావలెను; నటీనటులు: నాగశౌర్య, రీతూ వర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య తదితరులు; మాటలు: గణేష్ కుమార్ రావూరి; ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; కూర్పు: నవీన్ నూలి; కళ: ఏ.ఎస్.ప్రకాష్; సమర్పణ: పి.డి.వి.ప్రసాద్; నిర్మాత: సూర్య దేవర నాగవంశీ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
పాటలు, ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతూ వర్మ కలిసి నటించడం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో కీలక సినిమా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
కథేంటంటే: హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తుంటుంది భూమి (రీతూ వర్మ). ఆఫీస్లో ఆమె చాలా స్ట్రిక్ట్. ఎవరి పనీ ఒక పట్టాన ఆమెకు నచ్చదు. రాక్షసి అంటూ ఆఫీస్ ఉద్యోగులు ఆమెను తిట్టుకుంటారు. ఆమెకు పెళ్లి చేయాలని తల్లి (నదియా) సంబంధాలు చూస్తుంటుంది. భూమి మాత్రం పెళ్లికి తిరస్కరిస్తూ వస్తుంది. అప్పుడే ఓ ప్రాజెక్ట్ పని మీద ఆకాష్ (నాగశౌర్య) హైదరాబాద్ వస్తాడు. పారిస్లో ఆర్కిటెక్ట్గా సెటిల్ అయిన ఓ తెలుగు కుర్రాడు ఆకాష్. భూమి పనిచేస్తున్న కంపెనీ బిల్డింగ్ కోసం ప్లాన్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ పుడుతుంది. ఇక వాళ్ల ప్రేమకథ కంచికి చేరుతుందనగానే కథలో మలుపు. ఆకాష్కి, భూమికీ మధ్య అంతకుముందు కాలేజీలో జరిగిన సంఘటనలు తెరపైకొస్తాయి. ఇంతకీ వాళ్లిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? అసలు కాలేజీలో ఏం జరిగింది? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథ ఇది. దాన్ని పెళ్లితోను, వయసొచ్చిన బిడ్డలకి పెళ్లి చేసి భారం దించుకోవాలని మధనపడే తల్లిదండ్రుల కథతోనూ ముడిపెట్టి సినిమా తీశారు. రెండు దశల్లో సాగే ప్రేమకథల సమాహారమే అయినా.. మొత్తంగా చూస్తే ఇందులో ఉన్నది సన్నటి కథే. ఆరంభ సన్నివేశాలు భూమి పాత్ర చుట్టూనే సాగుతాయి. ఆమె ఆఫీస్ వాతావరణం, ఆమె బాసిజం నేపథ్యంలో సరదాగా సాగుతాయి. ఆ సన్నివేశాలు ‘మన్మథుడు’ని గుర్తు చేస్తాయి. కాకపోతే అక్కడ బాస్ హీరో, ఇక్కడ హీరోయిన్. అంతే తేడా. ఆకాష్ పాత్ర పరిచయం తర్వాత కథలో వేగమేమీ పెరగదు. భూమి.. ఆకాష్ని ప్రేమించిన తర్వాతే కథలో ఓ అడుగు ముందుకు పడినట్టు అనిపిస్తుంది.
ఆ వెంటనే వచ్చే విరామ సన్నివేశాలతో అనూహ్యంగా ఓ మలుపు. అక్కడ ఆకాష్తో తనకున్న బంధం గురించి భూమి చెప్పే మాటలు ఆసక్తిని కలిగిస్తాయి. తదుపరి కథపై ఆత్రుతని పెంచుతాయి. ద్వితీయార్ధం ఫ్లాష్బ్యాక్తో మొదలవుతుంది. అక్కడ మరో ప్రేమకథ మొదలైనట్టు అనిపించినా అందులో కొత్తదనమేమీ లేదు. కాకపోతే నాయకానాయికలు కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఫ్లాష్బ్యాక్ తర్వాత మురళీశర్మ, నదియ మధ్య కూతురి పెళ్లి గురించి జరిగే చర్చ హత్తుకునేలా ఉంటుంది. ఆ తర్వాత భూమి ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల పెళ్లి హంగామా మొదలవుతుంది. అక్కడ సప్తగిరి చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగినా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉండటం సినిమాకి కలిసొచ్చే విషయం. మాటలు, పాటలు సినిమాకు ప్రధాన బలం.
ఎవరెలా చేశారంటే: నాగశౌర్య, రీతూ వర్మ అందంగా కనిపించారు. వాళ్లు ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పలికించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రలకి సరైన ఎంపిక అనిపిస్తారు నాయకానాయికలు. విరామానికి ముందు, క్లైమాక్స్కి ముందు సన్నివేశాల్లో ఆ ఇద్దరి నటన హత్తుకుంటుంది. పాటల్లోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలరించింది. సప్తగిరి, వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ తదితరులు నవ్వించే బాధ్యతని తీసుకున్నారు. మురళీశర్మ, నదియా కథానాయిక తల్లిదండ్రులుగా చక్కటి పాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం, తమన్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గణేశ్ రావూరి మాటల్లో మెరుపు కనిపిస్తుంది. దర్శకురాలు లక్ష్మీసౌజన్యకి ఇదే తొలి చిత్రమైనా ఎంతో పరిణతితో సన్నివేశాల్ని తెరపైకి తీసుకొచ్చారు.
బలాలు
+ కుటుంబ వినోదం
+ నాగశౌర్య, రీతూ జోడీ
+ ద్వితీయార్ధంలో కామెడీ
+ పాటలు
బలహీనతలు
– సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలు
– ఊహకు తగ్గట్టుగా సాగే కథ
చివరిగా: భూమి.. ఆకాష్లు మెప్పిస్తారు.