ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రెబల్ ఎంపీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టు పరిస్థితి మారింది. ఈ పార్లమెంట్ సమావేశాల లోపే ఎంపీ రఘు రామ పై వేటు పడేలా పావులు కదిపింది. స్పీకర్ కు పదే పదే ఫిర్యాదులు చేసింది.. కానీ కేవలం నోటీసులతోనే స్పీకర్ ప్రస్తుతానికి సరిపెట్టారు. దీంతో ఇటు స్పీకర్, అంటు కేంద్రం తీరుపై వైసీపీ స్వరం పెంచింది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ రఘురామ. ఒక ఎంపీనైన తనను పోలీసులు విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారు అనే అంశాన్ని పార్లమెంట్ లో చర్చకు తేవాలి అని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెగాసెస్ దూమారంతో సభా వ్యవహారాలు సజావుగా సాగడం లేదు. దీంతో ప్లాన్ మార్చిన రఘురామ.. వైసీపీ తప్పులను.. విమర్శలను కేంద్రానికి చేరవేసే పనిలో పడ్డారు. తాజాగా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఏపీలోజగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్లో అప్పుల విధానంపై కాగ్ ఆడిట్ జరిపించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సుమారు 25 వేల కోట్ల అప్పుపై పూర్తి స్థాయిలో కాగ్తో ఆడిట్ జరిపించాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందనిరఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్స్ దాటి.. కేంద్రం దృష్టికి తీసుకురాకుండా అప్పులు చేస్తున్నారని అందులో ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోందన్నారు. ఎవరికీ తెలియకుండా అప్పులు చేస్తున్నారని.. కేంద్రానికి తెలియకుండా అప్పులు చేయడం సరైంది కాదని రఘురామ పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే విషయంలో టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఆయన ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కూడా.. ఇదే సమయంలో ఎంపీ రఘురామ కేంద్రానికి అది నేరుగా ప్రధానికి లేక రాయడం సంచలనంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఎందుకు తీసుకుంటున్నారని ఆ లేఖలో ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసం సంవత్సరానికి సుమారు 10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఉందన్నారు. చెప్పిందే చెప్పి.. చేసిందే చేసి.. ప్రచారాలు చేసుకోవడం అలవాటైంది అన్నారు. తన లేఖల్ని కొట్టిపారేయొద్దని, ఇవాళో రేపో అనర్హత వేటు వేసే వ్యక్తి మాటలు ఎందుకు వినాలి అని అనుకోవద్దని ప్రధానిని ఆయన కోరారు. ఇటు వైసీపీ ఎంపీలపై సెటైర్లు వేసేలా లేఖ రాశారు.