వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచించింది. చికిత్స పూర్తి కావడంతో ఆసుపత్రి వర్గాలు రఘురామను డిశ్చార్జి చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలకు కావాల్సిన ప్రక్రియ అంతా ఆయన తరఫు న్యాయవాదులు పూర్తి చేశారు. రఘురామ కాళ్లనొప్పితో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.