బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రామ్ మధ్వానీ తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్, వికాస్ కుమార్, విశ్వజీత్ ప్రధాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కార్తీక్ న్యూస్ రీడర్గా కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. చిత్రబృందం మంగళవారం ట్రైలర్ను విడుదల చేసింది. ముంబయిలోని ఓ వంతెనను బాంబులు పెట్టి ఉగ్రవాదులు పేల్చేస్తారు. దానిని ప్రత్యక్షంగా చూసిన న్యూస్ రీడర్ అర్జున్ పాథక్(కార్తీక్ ఆర్యన్) ప్రైమ్టైమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ‘‘నేను అర్జున్ పాథక్ భరోసా 24/7 నుంచి ‘నేను చెప్పేదంతా నిజం’’ అంటూ ఆ ఉగ్రవాదితో మాట్లాడతాడు. ‘మీ డిమాండ్లు ఏంటి’ అని అడగ్గా, ‘మంత్రి జయదేవ్ పాటిల్ క్షమాపణ చెప్పాలి. లేకపోతే వంతెనను పూర్తిగా పేల్చేస్తాం’ అని ఉగ్రవాది అంటాడు. అదే సమయంలో ఉగ్రవాదులు బాంబులు అమర్చిన వంతెనపై నిలబడి అర్జున్ భార్య న్యూస్ రిపోర్టింగ్ చేస్తుంటుంది. మరి అర్జున్ తన భార్యను ఎలా కాపాడుకున్నాడు? మంత్రితో మాట్లాడేందుకు ఉగ్రవాదులు ఎందుకు ప్రయత్నించారు? ఆ చర్చలు ఫలించాయా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నవంబరు 19న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.