టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం అమరావతి నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా ఆయన రూటు మార్చమని తన భద్రతా సిబ్బందికి చెప్పారు. ఆయనకు వచ్చిన సమాచారంతో ఆఘమేఘాలతో కాన్వాయ్ను ఓ ఆస్పత్రికి మళ్లించారు. చంద్రబాబు వెంటన ఉన్న ఉన్న సిబ్బందికి ఏం జరుగుతోందో తెలియలేదు. హైదరాబాద్ వెళ్దామన్న ఆయన ఆస్పత్రికి ఎందుకు వచ్చారో అర్థకాకం కాసేపు కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. తరువాత అసలు విషయం తెలుసుకుని రిలీఫ్ అయ్యారు. సాధరణంగా సినిమా స్టార్లను చూడడమే తమ చివరి కోరిక అని అభిమానులు చెప్పడం.. వారిని చూసేందుకు ఆ హీరో ఆ ఇంటికి లేదా చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లడం చూస్తుంటాం.. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం అలాంటి అభిమానులు ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకు చెందిన టీడీపీ వీరాభిమాని బొప్పన రాఘవేంద్రరావు కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారు. రాఘవేంద్రరావు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన చంద్రబాబును చూడాలి అని తన మనసులో కోరిక చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు విషయాన్ని పార్టీ నేతలకు వివరించారు.
బొప్పన రాఘవేంద్రరావు టీడీపీ వీరాభిమాని. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీని వెన్నంటే ఉన్నారు. తాజాగా వయోభారం కారణంగా ఆయన అనారోగ్యంపాలై విజయవాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన నేత చంద్రబాబును చూడాలనేదే చివరి కోరిక అని కుటుంబసభ్యులకు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబు తన కాన్వాయ్ ను బొప్పన రాఘవేంద్రరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి మళ్లించారు. రాఘవేవంద్రరావును పరామర్శించారు. తన కోసం వచ్చిన చంద్రబాబును చూసి రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అభిమానితో మాట్లాడిన చంద్రాబు.. ఆయనకు ధైర్యం చెప్పారు.. త్వరలో కోలుకోవాలని.. తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని ఆకాంక్షించారు. కోలుకుంటే మళ్లీ ఇంటికి వచ్చి కలుస్తాను అంటూ భరోసా ఇచ్చారు. దీంతో పెద్దాయన ఆనందానికి హద్దులు లేవు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కష్ట కాలం ఎదుర్కొంటోంది. దాదాపు అన్ని ఎన్నికల్లోనూ అపజయాలే వెక్కిరిస్తున్నాయి. ఏఏ నేతలు టీడీపీ వెంట ఉన్నారన్నది చెప్పే పరిస్థితి లేదు. అయితే నాయకులు చాలా మంది పార్టీకి దూరమైనా కేడర్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో కార్యకర్తలను టీడీపీ ఏనాడూ వదలలేదు. అలాగని పార్టీ కూడా కేడర్ ను ఏనాడూ విడిచిపెట్టిన దాఖలా లేదు. మొత్తంగా పార్టీకి అండాదండగా నిలిచిన కార్యకర్తలకు పార్టీ అధిష్ఠానం కూడా అండగానే నిలుస్తోంది. అందుకే దేశంలోని ఏ ఒక్క పార్టీకి లేని రీతిలో టీడీపీకి క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టే కార్యకర్తలు వందలు, వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారని రాఘవేంద్ర రావు లాంటి వారు నిరూపిస్తున్నారు.