క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండగొచ్చేసింది. సరిగ్గా అయిదునెలల వ్యవధిలో మెగా టోర్నమెంట్ కనువిందు చేయబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొనసాగిన ఐపీఎల్ 2020 మత్తు నుంచి దిగీ దిగకముందే.. మరో సీజన్ వచ్చేసింది. నెలన్నర రోజుల పాటు కొనసాగబోతోంది. అభిమానులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొద్దిసేపటి కిందటే IPL 2021 షెడ్యూల్ను విడుదల చేసింది.
🚨 BCCI announces schedule for VIVO IPL 2021 🚨
The season will kickstart on 9th April in Chennai and the final will take place on May 30th at the Narendra Modi Stadium, Ahmedabad.
More details here – https://t.co/yKxJujGGcD #VIVOIPL pic.twitter.com/qfaKS6prAJ
— IndianPremierLeague (@IPL) March 7, 2021
ఏప్రిల్ 9వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. తొలి మ్యాచ్కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోన్నాయి. మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 3:30, సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతాయి. మే 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ను నిర్వహించనున్నారు. నరేంద్ర మోడీ స్టేడియాన్ని కొద్దిరోజుల కిందటే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక్కడ నిర్వహించిన రెండు టెస్ట్ మ్యాచ్లల్లో భారత క్రికెట్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది.
పిచ్పై విమర్శలు వస్తోన్న వేళ.. అదే స్టేడియాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫైనల్ మాత్రమే కాదు.. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లకు కూడా ఈ స్టేడియమే వేదికగా మారింది. ఇదే పిచ్పై నిర్వహించిన రెండు వరుస టెస్ట్ మ్యాచ్లల్లో ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. రెండు, మూడు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచులు ముగిశాయంటే.. ఇక్కడ భారత్ జట్టు ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా నాలుగు స్టేడియాల్లో మాత్రమే ఐపీఎల్ మెగా టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు. అహ్మదాబాద్, చెన్నై, ముంబై, కోల్కత, బెంగళూరు, ఢిల్లీల్లో మ్యాచ్లను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ జట్ల మధ్య మొత్తం 56 మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ మినహాయించి మిగిలిన స్టేడియాల్లో 10 చొప్పున మ్యాచ్లు జరిపేలా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎనిమిది చొప్పున మ్యాచ్లు ఉంటాయి.
తమ సొంత మైదానంలో ఏ ఒక్క జట్టు కూడా తలపడకపోవడం ఈ సారి ఐపీఎల్ స్పెషాలిటీ. ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడబోదు. తటస్థంగా ఉండే వేదికలపైనే ఆడుతుంది. అదే పరిస్థితి అన్ని జట్లకూ ఉంటుంది. ఏ జట్టు కూడా తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లను ఆడబోదు. తటస్థ వేదికలపై మ్యాచ్లను నిర్వహించాల్సి రావడం పట్ల ఆయా ఫ్రాంఛైజీలకు చెందిన అభిమానులకు తీవ్రంగా నిరాశ కలిగించే విషయమే. అదే సమయంలో ఆరు స్టేడియాల్లో మాత్రమే పరిమితం చేయడం, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి చోటు కల్పించకపోవడం నిరాశ పరిచేదే.