ప్రియుడితో కలిసి హాలీడే ట్రిప్కు వెళ్లిన నటి ఈశ్వరి దేశ్ పాండే కారు ప్రమాదంలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరాఠీ నటి ఈశ్వరి ప్రియుడితో కలిసి పెస్టెంబర్ 15న గోవా హాలీడే ట్రిప్కు వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.
కారు సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో ఇద్దరూ కారులోంచి బయటకు రాలేకపోయారు. ఈ ప్రమాదంలో ఈశ్వరి(25)తో పాటు ఆమె ప్రియుడు శుభమ్ డెడ్జ్ (28) ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పటి నుంచి నటిగా రాణించాలని కలలు కన్న ఈశ్వరి దేశ్ పాండే హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇక శుభమ్తో ఈశ్వరికి చాన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరి స్నేహం ఇటీవలె ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి నిశ్చితార్థానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ట్రిప్కి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవమై తేలడం బంధువులను, స్నేహితులను షాక్కి గురిచేస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.